దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదన: నిందితుడి అరెస్ట్, నగదు-బంగారం స్వాధీనం
జగిత్యాల ప్రతినిధి ::
అర్జున్ సమాచారం ఆగస్టు 28::
పట్టణంలోని ఇస్లాంపూరలో జరిగిన దొంగతనం కేసును జగిత్యాల పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. పట్టణ ఇన్స్పెక్టర్ పి. కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం…ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి ఇస్లాంపూర్ నివాసి షబానా తబస్సుమ్ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 26వ తేదీన ఎస్సై కే. కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గురువారం (27వ తేదీ) మధ్యాహ్నం కరీంనగర్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని ఎస్సై కుమారస్వామి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో విచారించగా, అతడు ఇస్లాంపూర కే చెందిన మహమ్మద్ షోయబ్ (22, తండ్రి: ఎంబీ హబీబ్ ఖాన్) అని తేలింది. నిందితుడు దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో, అతని వద్ద నుంచి ₹90,000 నగదుతో పాటు 2.5 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సొత్తును సీజ్ చేసిన అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించి దొంగను పట్టుకున్న కానిస్టేబుళ్లు జీవన్, చంద్రశేఖర్లను పట్టణ సీఐ పి. కరుణాకర్ ప్రత్యేకంగా అభినందించారు.
.